In TRS some cold war is going on between MLAs and MLCs, according to the sources. MLAs are angry on MLCs while they also trying to get fame in the constituencies it seems.
టీఆర్ఎస్లో ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య కోల్డ్వార్ సాగుతోంది. ఇన్ని రోజులు ఎమ్మెల్సీల నిధుల విషయమై నేతలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఇప్పుడు అధికార దర్పం విషయంలో పోరు మొదలైంది. ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీల జోక్యం ఏమిటన్న అంశం తాజాగా వారి మధ్య వివాదానికి బీజం నాటింది. ఈ వ్యవహారం చినికిచినికి గాలివానగా మారి చివరకు సీఎం కేసీఆర్ వద్దకు చేరిందట.
ఎన్నికలకు ఇక ఏడాదిన్నర సమయమే ఉండడంతో ఆయా నియోజకవర్గాల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటినుంచే తమ తమ స్థానాలలో పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం తమకొచ్చే నిధులను ఖర్చు చేస్తున్నారు. తమ అనుచరుల్లో ఎవరైనా అసంతృప్తిగా ఉంటే వారిని అనునయించి మళ్లీ దగ్గరికి తీసుకుంటున్నారు. మరోవైపు టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కూడా ఆయా నియోజకవర్గాల్లో కలియతిరగడం, మీటింగ్లు నిర్వహించడం వంటి అంశాలు ఎమ్మెల్యేలకు ఆగ్రహం కలిగిస్తున్నాయి. ఎమ్మెల్సీలు తమ సీటుకు ఎక్కడ ఎసరు పెడతారో అన్న సందేహం కూడా ఎమ్మెల్యేలను పట్టి పీడిస్తోందట.