Rajkot City Bus Accident : హడావుడిగా ఆఫీస్కు వెళ్తున్నవారు కొందరు. పిల్లలను స్కూల్లో దింపేందుకు వెళ్తున్నవారు మరికొందరు. పనులకు వెళ్లేవారు ఇంకొందరు. ఇలా బిజీబిజీగా రోడ్డుపై వెళ్తున్నవారిని బస్సు రూపంలో వచ్చిన మృత్యువు బలి తీసుకుంది. సిగ్నల్ వద్ద ఆగి ఉన్న వారిపై ఒక్కసారిగా ఓ సిటీ బస్సు అదుపు తప్పి వచ్చి ఢీ కొట్టింది. దాదాపు 8 వాహనదారులపైకి దూసుకెళ్లింది. ఫలితంగా నలుగురు మరణించగా, మరో నలుగురు గాయపడి చికిత్స పొందుతున్నారు.
ఈ దారుణ ఘటన గుజరాత్లోని రాజ్కోట్ బుధవారం ఉదయం జరిగింది. సుమారు 10 గంటల సమయంలో ఇందిరా సర్కిల్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద గ్రీన్ లైట్ పడడంతో అందరూ వెళ్తున్నారు. ఈ క్రమంలోనే వెనుక నుంచి వేగంగా వచ్చిన సిటీ బస్సు అదుపు తప్పి ముందుగా వెళ్తున్న వాహనాలపైకి దూసుకెళ్లింది. రెండు కార్లతో పాటు నాలుగు ద్విచక్రవాహనాలను ఢీ కొట్టింది. దీంతో నలుగురు మరణించగా, మరో నాలుగరు గాయపడ్డారు. ప్రస్తుతం వీరంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించిన ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.